telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి!

Motkupalli Narasimhulu

తెలంగాణ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన మోత్కుపల్లి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మోత్కుపల్లితో పాటు అమిత్‌ షాను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఆ పార్టీ నాయకులు వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, వీరెందర్‌ గౌడ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పరిస్థితులను లక్ష్మణ్‌ అమిత్‌ షాకు వివరించారు.

టీడీపీలో వేటు పడిన తర్వాత మోత్కుపల్లి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో సామాజిక న్యాయం లేదని కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోత్కుపల్లి టీఆర్ఎస్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు, తెలంగాణలోని అసంతృప్త కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ ఈ క్రమంలో మోత్కుపల్లిపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

Related posts