ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టిండు తప్పితే చేసిందేమీ లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోదీ మోసం చేసిండన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి మద్దతుగా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్షోలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుబేరులకు లాభం చేసి విదేశాలకు పంపిన ఘనుడు మోదీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పథకాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్, ఏపీ మంత్రి లోకేష్ ఇద్దరూ జోకర్లే అని మంత్రి విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆ పార్టీ నేతలు అడుగుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాహుల్ ప్రధాని అయితే తెలంగాణకు ఏం లాభం? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ చేతకాని తనం వల్లే తెలంగాణ అధోగతి పాలైందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.