మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే ) అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసినట్టు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో చెప్పింది.
అంత్యక్రియలకు భారీ సంఖ్యలో మావోయిస్టులు హాజరైనట్లు తెలిపారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు కూడా భారీగా తరలివచ్చినట్టుగా తెలుస్తోంది.
చత్తీస్ గఢ్ లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల మధ్య దండకారణ్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కే ఈనెల 14న చనిపోయారు. 65 ఏళ్ల రామకృష్ణపై వివిధ రాష్ట్రాల్లో 200కు పైగా కేసులు.. కోటిన్నరకు పైగా రివార్డ్ ఉంది.