telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

డేరాబాబాకు పెరోల్ నిరాకరించిన జైలు అధికారులు

dera baba jail

తన ఆశ్రమంలో ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్‌ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం సునారియా జైలులో గుర్మీత్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో డేరాబాబా కు పెరోల్ ఇచ్చేందుకు రోహ్‌తక్ జైలు అధికారులు నిరాకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు మూడు వారాల పెరోల్ కావాలంటూ డేరాబాబా చేసిన అభ్యర్థనను జైలు అధికారులు కొట్టివేశారు.

డేరాబాబా భార్య హజ్రిత్ కౌర్ ఈ నెల 5న తన భర్తకు పెరోల్ కోరుతూ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. గుర్మీత్ సింగ్ తల్లి నసీబ్ కౌర్ (85) అనారోగ్యంతో బాధపడుతున్నారని, కుమారుడు వస్తే తప్ప చికిత్స చేయించుకోనని అంటున్నారని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి గుర్మీత్‌కు పెరోల్ ఇప్పించాలని అభ్యర్థించారు.

పిటిషన్‌ను విచారించిన కోర్టు హజ్రిత్ కౌర్ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శాంతిభద్రతల సమస్యలతో పాటు గుర్మీత్ తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కారణాలు చూపుతూ గుర్మీత్‌ను పెరోల్‌పై బయటకు పంపేందుకు జైలు అధికారులు నిరాకరించారు.

Related posts