telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ప్రియుడితో పెళ్లి కోసం.. 40 కిలోమీటర్ల కాలినడక

లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియుడి వద్దకు కాలినడకతో వెళ్లి అతడితో తాళికట్టించుకుందో ప్రియురాలు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయిపున్నయ్య, హనుమాన్ జంక్షన్‌కు చెందిన సీహెచ్ భవానీ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

తాను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని భవానీ తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇందుకు అంగీకరించని భవానీ తల్లిదండ్రులు పున్నయ్యకు ఫోన్ చేసి బెదిరించారు. భవానీని మర్చిపోవాలని హెచ్చరించారు. విషయం తెలిసిన యువతి ఎలాగైనా పున్నయ్యనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఓ శుభముహూర్తాన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా కాలినడకన ఈడేపల్లికి బయలుదేరింది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈడేపల్లికి బుధవారం చేరుకుని ప్రియుడిని కలిసింది. అనంతరం ఇద్దరూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను కలిసి విషయం చెప్పి సాయం కోరారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించిన పోలీసులు వారికి నచ్చజెప్పి కొత్త జంటను వారి వెంట పంపడంతో ప్రేమ కథ సుఖాంతంగా ముగిసింది.

Related posts