దేశంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 79కి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘కరోనా’ కట్టడికి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా 274 జిల్లాలు ప్రభావానికి గురైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా 274 జిల్లాల్లో ‘కరోనా’ ప్రభావం ఉందని అన్నారు. నిన్నటి నుంచి కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3374 కు చేరిందని చెప్పారు. గత ఇరవై నాలుగు గంటల్లో 11 మంది మృతి చెందగా, 267 మంది కోలుకున్నారని వివరించారు. అనంతరం కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యా సలిలా శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ, లాక్ డౌన్ ఆంక్షలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరా బాగుందని ప్రశంసించారు.