భారత గానకోకిలగా సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్ల పాటు తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన లతా మంగేష్కర్ అశేష అభిమానులను వదిలి నింగికెగసిరారు.
లతా మంగేష్కర్ 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతి. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకళాకారుడు. ఆయనకు ఐదు మంది పిల్లలు. వారిలో లతనే అందరికంటే పెద్ద. ఆమె తరువాత ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఉన్నారు. దీనానాథ్ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగానూ నటించారు లత. తరువాతి రోజుల్లో లత గాయనిగా మారి ప్రతి పాటలోనూ అమృతం కురిపించారు.
లత కంటే ముందు నూర్జహాన్, ఖుర్షీద్, సురయ్యా, షంషాద్ బేగం వంటి మేటి గాయనీమణులు రాజ్యమేలారు. వారు ఉన్న సమయంలోనే లత సైతం తనదైన బాణీ పలికించారు కానీ అంతగా పేరు రాలేదు. దేశ విభజనలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి ప్రముఖ గాయకులు పాకిస్థాన్ వెళ్లిపోవడం వల్ల లతా మంగేష్కర్ దశ తిరిగింది. లత పాటనే హిందీ సినిమాకు ఓ కొత్త బాటను చూపించి స్టార్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు.
‘మహల్'(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్ మలుపు తిరిగింది. ఆ తరువాత సొంత నిర్మాణ సంస్థలోని తెరకెక్కించిన ‘లేఖిని’ సినిమాలోని పాట జాతీయ అవార్డును లతాను వరించింది. ఈ చిత్రానికి ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతం సమకూర్చడం విశేషం. 1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.
1972లో రూపొందిన ‘పరిచయ్’ చిత్రంలో గుల్జార్ రాసిన పాటకు ఆర్డీ బర్మన్ స్వరకల్పనలో లత గానం చేసిన పాట ఆమెకు తొలి నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. మరో రెండేళ్ళకు అంటే 1974లో ‘కోరా కాగజ్’ సినిమాలో కళ్యాణ్ జీ – ఆనంద్ జీ బాణీల్లో లతకు మరో నేషనల్ అవార్డు లభించింది. . నాలుగు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే…లతా మంగేష్కర్ కీర్తి కిరీటంలో ప్రతిష్ఠాత్మక అవార్డులూ చోటు చేసుకున్నాయి. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్. ఇలా దేశం గర్వించదగ్గ అవార్డులన్నీ లత గానామృతం చేరి మరింత వెలుగులు విరజిమ్మాయి.
తెలుగువారితోనూ లతకు విడదీయరాని బంధం ఉంది. 1955లో తెరకెక్కిన ఏయన్నార్ ‘సంతానం’ చిత్రంలో తొలిసారి లత నోట తెలుగుపాట పలికింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో లత తన తొలి తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా…” గానం చేసి అలరించారు. ఈ పాట ఈ నాటికీ సంగీతాభిమానులను పరవశింప చేస్తూన ఉంది.
1988లో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా స్వరకల్పలో “తెల్లచీరకు తకధిమి…” పాటను ఆలపించారు లత. ఇక 1991లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో లతా మంగేష్కర్ గానం చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. అలా నందమూరి, అక్కినేని కుటుంబాలతో లతకు అనుబంధం ఉంది. మరో విశేషమేమంటే, ఆ ఇద్దరు మహానటుల పేరున నెలకొల్పిన జాతీయ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. 1999లో యన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏయన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్ కు లభించాయి.
1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా పాడిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరపురాని మధురం పంచిన లతా మంగేష్కర్ లేరనే వార్త, సినీ పరిశ్రమకు, దేశ వ్యాప్తంగా అభిమానులకు తీరని లోటు.