లెజెండరీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లతాజీ భౌతికకాయానికి మోదీ నివాళులు అర్పించారు. అనంతరం లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
లతా మంగేష్కర్ మరణం యావత్ దేశాన్ని, ప్రపంచ సంగీత ప్రియులను శోకసంద్రంలోకి నెట్టి దివికేగారు. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివస్తున్నారు.
అంతకుముందు త్రివర్ణ పతాకం ధరించిన గాయని లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ఆదివారం సాయంత్రం ముంబైలోని ఆమె నివాసం నుంచి దాదర్లోని శివాజీ పార్క్కు ఆర్మీ ట్రక్కులో అంతిమయాత్ర సాగింది. మంగేష్కర్ సోదరి ప్రముఖ గాయని ఆశా భోంస్లే, ఆమె కుటుంబ సభ్యులు కొందరు ట్రక్కులో మృతదేహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
ముంబైలోని శివాజీ పార్క్లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక లతాజీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అయిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
లతా మంగేష్కర్ అంతిమయాత్రలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. గోవాలో ఎన్నికల ప్రచారాన్ని కుదించి ముంబైకి వచ్చి నివాళులర్పించారు.