telugu navyamedia
రాజకీయ

తిరుమలలో టి.వీ కెమెరాలు అవసరమా ?

రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలే తీసుకుంటాయని గతంలో ఓ తలపండిన రాజకీయవేత్త చెప్పారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సాగే ప్రభుత్వమైనా రాజకీయ నిర్ణయాలకే పెద్ద పీట వేస్తుంది. ఇది నిర్వివాదాంశం. కాకపొతే, కొందరు మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకోరు, కొందరికి ఆ పట్టింపు కూడా వుండదు.

కాబట్టి, టీటీడీ కొత్త జంబో బోర్డు నిర్ణయం కూడా అదే బాపతు అనుకోవాలి. రాజకీయ పార్టీలే కాదు బ్యూరోక్రాట్లు కూడా అవసరాలకు (ఇక్కడ తమ అవసరాలకు తగ్గట్టుగా అని అర్ధం) హోదాలు పెంచుకుంటూ పోయిన సందర్భాలు వున్నాయి. ఆ నిర్ణయాలు ప్రభుత్వానివి అని సమర్థించుకుంటే చేసేది ఏమీ లేదు. రాజకీయ నాయకుల్ని కనీసం అయిదేళ్లకోసారి మార్చే వెసులుబాటు అన్నా వుంది.

పూర్వం అంటే 1970 ప్రాంతాల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి కలిపి, నంబియార్ అని ఒకే ఒక పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ వుండేవారు. ఇప్పుడు ఎంతమంది వున్నారు అంటే చప్పున చెప్పలేము. అప్పుడు డీజీ అనే పోస్టే లేదు. మరి ఇప్పుడో. అలాగే చీఫ్ సెక్రెటరీ హోదా కలిగిన వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిందో కూడా చెప్పలేము.
గతంలో అంటే నలభయ్ ఏళ్ళ క్రితం ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు తన మంత్రివర్గాన్ని అరవై మందితో విస్తరించినప్పుడు ఇలాగే నొసళ్ళు నొక్కుకున్నారు. జంబో మంత్రివర్గం అంటూ పత్రికలు ఎద్దేవా చేశాయి . అసమ్మతి వర్గం ఈ అంశాన్ని అధిష్టానం దగ్గర తమకు అనుకూలంగా మార్చుకుని అంజయ్య గారు దిగిపోయేదాకా నిద్ర పోలేదు సరే. ఆయన నిష్క్రమణకు రాజీవ్ గాంధి వ్యవహార శైలి కూడా దోహదం చేసింది అనుకోండి.

ముఖ్యమంత్రి అంజయ్యకు భోలా మనిషి అనే పేరు వుంది . . ఏదీ కడుపులో దాచుకునే రకం కాదు. ఆయనే స్వయంగా నాతొ అన్నమాటలు ఇవి. “చూశావా శ్రీనివాసూ. ఒక జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండవచ్చు. కానీ ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు వుండకూడదు అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ” అన్నారు . రాజకీయాల్లో న్యాయం ప్రసక్తి ఏముంటుంది? ఇక టీటీడీ విషయానికి వస్తే, ఆ జంబో బోర్డు సభ్యులకు ఓ విజ్ఞప్తి. “మీ మొట్టమొదటి సమావేశంలోనే ఓ తీర్మానం చేయండి. మీ మీద వచ్చిన నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి.

Sri Venkateswara Swamy Temple, Tirumala - Info, Timings, Photos, History

“మేము సభ్యులుగా వుండగా మా చుట్ట పక్కాలకు కానీ, అనుచర వర్గాలకు కానీ, స్వామి దర్శనం కోసం సిఫారసు లేఖలు ఇచ్చే అధికారాన్ని స్వచ్చందంగా వదులుకుంటున్నాము. మా పరిధిని కేవలం దేవస్థానం అభివృద్ధికి, యాత్రీకుల సేవల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేసుకుని వ్యవహరిస్తాము”
ఆ చేత్తోనే మరో తీర్మానం చేసి పుణ్యం కట్టుకోండి.“దేవాలయ పరిసరాల్లో టీవీ కెమెరాలను అనుమతించం. రాష్ట్రపతి వంటి పెద్దలు వస్తే ఎలాగూ ఎస్వీ ఛానల్ చూసుకుంటుంది.”
– భండారు శ్రీనివాసరావు

Related posts