తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు నువ్వేంతా అంటే నువ్వేంతా అని పోటీ పడుతున్నాయి. అనేక హామీలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. అటు బీజేపీ తన పాగా వేసే దిశగా తమిళనాడులో కసరత్తు చేస్తోంది. తాజాగా బీజేపీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటి కుష్బూ.. తనను గెలిపిస్తే ప్రతి ఆడపిల్ల బ్యాంకు అకౌంట్లో రూ. లక్ష వేస్తానని హామీ ఇచ్చింది. శనివారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కుష్బూ సుందర్.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.