లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు రోడ్లపైకి వస్తున్న వారిపై ఇష్టానుసారంగా లాఠీలకు పనిచెప్పడం పరిపాటిగా మారింది. అయితే వనపర్తిలో కుమారుడితో కలిసి వెళుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలీసులు ప్రజల పట్ల హేయమైన రీతిలో ప్రవర్తించరాదని హితవు పలికారు. వనపర్తి ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలకు సూచించారు.
వనపర్తిలో కొడుకుతో కలిసి వెళుతున్న వ్యక్తిని పోలీసులు కిందపడేసి చితకబాదగా, అక్కడే ఉన్న ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోను మంత్రి కేటీఆర్ కు పంపడంతో, పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనల వల్ల పోలీసు శాఖ మొత్తం అప్రదిష్ఠపాలవుతోందని మంచి పోలీసులపైనా చెడు ముద్ర పడుతోందని అన్నారు.