సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులతో ఉత్తర్ప్రదేశ్ రాజకీయాలు వేడి ఎక్కుతుంది. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు బీజేపీలో చేరగా ఆ కుటుంబం నుంచి మరొకరు సమాజ్వాదీ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ములాయం తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. మాఫియా, నేరస్థులను పార్టీలో చేర్చుకుంటున్నారని.. ఇక, పార్టీలో ములాయం సింగ్ ఓ ఖైదీగా మారిపోయారని ఆరోపించారు. శివపాల్ యాదవ్ పరిస్థితి కూడా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనతో పాటు సమాజ్వాదీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నారని చెప్పారు. దీనిపై వారు సంప్రదింపులు జరుపుతున్నారని, భాజపా అధిష్ఠానం నుంచి అనుమతి రాగానే పార్టీలో చేరతారని వెల్లడించారు.
2012 ఎన్నికల్లో ఎస్పీ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 2014 ఎన్నికల సమయంలో శివపాల్-అఖిలేష్ మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎస్పీని వీడారు.