telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముందస్తు ఎన్నిక‌ల‌పై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.

మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఖాయం. కాంగ్రెస్, బీజేపీ సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్ ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే తేల్చాయి.

ఎనిమిదేళ్ల పాలన తర్వాతా ప్రజల నుంచి మంచి స్పందన ఉందంటే కేసీఆర్, టీఆర్ ఎస్‌కు ఉన్న ఆదరణకు నిదర్శన మ‌ని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్‌ వివరంగా చెప్పారు.

కేసీఆర్ దొర అయితే ఎంతమందిని జైల్లో వేశారని ఆయన ప్రశ్నించారు.  మంచి పనులతో ప్రజల మనసులు గెలవడం బీజేపీ  చేతకాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.  కేసీఆర్ ఎవరికీ లొంగరు, బెదరని కేటీఆర్ తేల్చి చెప్పారు. 

బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీనే అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్‌లో అన్‌పార్లమెంట్‌ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్‌కు సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ గుజరాత్‌. గతంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్‌ చేసుకోలేదు.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్‌, రేవంత్‌ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్‌ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు’’ని ప్రశ్నించారు.

Related posts