ఆర్టీసీ కార్మికుల సమ్మె పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం పండుగ పూట జీతాలు కూడా ఇవ్వకుండా కార్మికుల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర చేస్తున్నారనీ, ఇప్పటికే వరంగల్లో మూడెకరాలను అనుచరులకు ఇచ్చేశారని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు పార్టీ తరపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.
గత ఆరు సంవత్సరాల్లో ఆరు సార్లు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, కష్టపడి పనిచేస్తోన్న కార్మికులను డిస్మిస్ చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ కార్మికశాఖా మంత్రిగా పనిచేసినా చట్టాలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పాలకులు నియంతలుగా మారి ప్రశ్నించే వాళ్ల గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ మెడలు వంచే సత్తా కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.