కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టును పదిహేనవ ఆర్థిక సంఘం నేడు సందర్శించనున్నది. మధ్యాహ్నం 12.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు ఈ బృందం వెళ్లనున్నది. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు మేడిగడ్డ బరాజ్ పనులను బృందం సభ్యులు సందర్శిస్తారు.
భోజన అనంతరం 2.245 గంటలకు ప్యాకేజీ-6లో భాగంగా కొనసాగుతున్న నందిమేడారం టన్నెల్, పంపుహౌస్, సర్జ్పూల్ పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు సిరిసిల్లలో మిషన్ భగీరథ పనులను పరిశీలించి 5.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లుచేశారు. మేడిగడ్డ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుతో పాటు ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఫొటోలు, మ్యాపులతో ఛాయాచిత్ర ప్రదర్శనకు ఏర్పాటుచేశారు.