తాజాగా కార్తి హీరోగా నటించిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించారు. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రదర్శితమవ్వలేదు. ఎందుకంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే షోలలో ‘ఖైదీ’ లేదు. ఉదయం 11 గంటల నుంచి షోలు మొదలవుతాయి. కానీ తమిళనాట ఇప్పటికే షోలు పడిపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ‘ఖైదీ’ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కాకపోతే ‘ఖైదీ’ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చుతుందట. ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమమైన థ్రిల్లర్స్లో ‘ఖైదీ’ ఒకటని అంటున్నారు. అద్భుతమైన నేపథ్య సంగీతం, ఎంగేజింగ్ స్క్రీన్ప్లే సినిమాకు ప్రధాన బలాలని చెబుతున్నారు. ఛేజ్ సీన్స్ అయితే ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోనివ్వవట. అంత బాగా తీశారని ట్వీట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొత్తం రాత్రి వేళలోనే నడుస్తుంది. అయినప్పటికీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందట. మొత్తానికి కార్తీ ఖాతాలో హిట్టు పడ్డట్లే అంటున్నారు.