లాక్ డౌన్ పొడిగింపుతో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని తమ స్వగ్రామాలకు చేర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి నిమిత్తం ఉత్తర కర్ణాటక నుంచి బెంగళూరుకు వచ్చిన వలస కార్మికులు, దినసరి కూలీలను కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వారి స్వస్థలాలకు తరలించాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరులోని పలు బస్టాండ్లు వలస కార్మికులతో కిటకిటలాడిపోతున్నాయి.
ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వలస కార్మికులు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఈ ఖర్చును తాము భరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.వలస కార్మికులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నష్టాలను కొంతలో కొంత భర్తీ చేసుకోవాలని కేఎస్ఆర్టీసీ మొదట్లో భావించింది. అందుకని, భారీ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంది. దీనిపై వలస కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు.