ఢిల్లీ అల్లర్లలో 28 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ హింసపై ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ నిన్న తీవ్రంగా స్పందించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఢిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్నాయని చెప్పిన ఢిల్లీహైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ మురళీధర్పై వేటు పడింది. కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించిన ఆ న్యాయమూర్తిని బదిలీ చేశారు. పంజాబ్, హర్యాణా హైకోర్టుకు ఆయనను ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే, ఇది కేవలం సాధారణ బదిలీ మాత్రమేనని… రెండు వారాల క్రితమే ఆయన బదిలీకి సుప్రీంకోర్టు ప్యానెల్ రెకమెండ్ చేసిందని అధికారిక వర్గాలు తెలపడం గమనార్హం.
ఢిల్లీ హైకోర్టులో మూడో సీరియన్ జడ్జిగా జస్టిస్ మురళీధర్ ఉన్నారు. ఆయనను బదిలీ చేస్తున్నట్టు నిన్న రాత్రి 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్ని రోజుల వ్యవధిలో పంజాబ్ మరియు హర్యాణా హైకోర్టులో బాధ్యతలను తీసుకోవాలో ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం గమనార్హం. అంటే, తక్షణమే ఆయన కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది.