పుదుచ్చేరిలోని వంబాకీరపాళెయానికి చెందిన జాలర్లు కొందరు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో వలలో రాకెట్ బూస్టర్ చిక్కింది. 13.5 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు కలిగి 16 టన్నుల బరువున్న దానిని 4 పడవలకు కట్టి తీరానికి చేర్చారు. దానిపై ఎఫ్ఎల్ 119, పీఎస్ఎంవో-ఎక్స్ఎల్ అని, 23.2.2019 తేదీ రాసి ఉంది. బూస్టర్ను వంబాకీరపాళెయం లైట్ హౌస్ దగ్గర ఉంచి శ్రీహరికోటలోని షార్ కేంద్రం అధికారులకు సమాచారం అందించారు. జాయింట్ డైరెక్టర్ హోదాలోని అధికారి ఆధ్వర్యంలో నలుగురు పుదుచ్చేరికి చేరుకున్నారు.
రాకెట్ బూస్టర్ను తీసుకెళ్లేందుకు 16 చక్రాల లారీ, దానిపైకి ఎక్కించేందుకు భారీ క్రేన్ను రప్పించారు. బూస్టర్ కారణంగా నాలుగు వలలు పాడయ్యాయని, 30 మంది జాలర్ల ఒక రోజు జీవనాధారం పోయిందని, మొత్తం రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని, కనీసం రూ.10 లక్షలు చెల్లించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. అప్పటి దాకా బూస్టర్ను తీసుకెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. పోలీసులు, తీర భద్రతదళం అధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాకెట్ బూస్టర్ను తరలించారు. ఈ బూస్టర్ నవంబరు 27న ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహానికి సంబంధించినదని అంతరిక్ష ప్రయోగ కేంద్రం అధికారులు తెలిపారు.