కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో ఆపద్భాందవుడులా వచ్చి అనేక వేలమందిని స్వస్థలాలకు చేర్చి , ఎందరో ఆపన్నులను ఆదుకున్న వాడు సోనూసూద్. ఆయన తెర మీద మాత్రమే విలన్.. నిజ జీవితంలో హీరో . ఎంతో మంది హీరోలు కోట్లు తీసుకుంటూ ప్రజలు ఆపదలో వున్నపుడు కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడరు . కానీ సోను సూద్ చేస్తున్న సేవకు ఇవ్వాళ కోట్లమంది ఆయన్ని అభిమానిస్తున్నారు , ప్రేమిస్తున్నారు.
అలాంటి మనసున్న సోనూసూద్ కు సంబంధించిన నివాసం , ఇతర కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేయడం రాజకీయ కక్ష తోనే అనే మాట వినిపిస్తుంది . ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేస్తున్నారు . ఢిల్లీలో అలాగే పంజాబ్ ప్రభుత్వం తరుపున కూడా కరోనా వైరస్ గురించి అక్కడి ప్రజల్లో అవగాహన కలిగించే బ్రాండ్ అంబాసిడర్గా సోనూసూద్ సేవలందిస్తున్నారు .
అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , ఇటు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఇద్దరితో సోను సూద్ కు మంచి సంబంధాలు వున్నాయి . ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీకి చెందినవారు కాదు. పైగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్రానికి వ్యతిరేకమే . కాబట్టి సోనూ సూద్కు సంబంధించిన ఇల్లు , కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చెయ్యడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది.
దేశంలో లాక్ డౌన్లో వలస కార్మికులకు సోను దేవుడిలా కనిపించాడు . అందరినీ బస్సులు, రైళ్లు ద్వారా సొంత గ్రామాలకు చేర్చాడు. అలాగే విదేశాల్లో చిక్కుకున్న వారిని విమానాల్లో దేశానికి రప్పించాడు . నిజానికి ఇవ్వన్నీ ప్రభుత్వం చెయ్యాలి . కానీ సోనూ ఒక వ్యక్తిగా చేశాడు. . అంతేకాదు ఇప్పటికీ కరోనా బాధితులకు ఖరీదైన మందులు, ,ఆక్సిజన్ సిలిండర్లు అవసరం వచ్చిన చోట ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాడు. .. సేవకు ప్రతి రూపంగా వున్న సోను సూద్ కు దేశంలోని అత్యున్నత పురస్కారం వస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆదాయ పన్ను అధికారులతో సోదా చేయించడం రాజకీయ కక్ష కాదా ?