ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. హుజురాబాద్, బద్వేలులో అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలోని బద్వేలులో వైసీపీ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఈసీ అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది.
ముఖ్యమైన తేదీలివే..
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నియోజకవర్గాలతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ, 3 లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నారు.