బంగాళాఖాతంలో ఓవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుటోంది. దీని ప్రభావంతో సోమవారం వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడివి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఆయా జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నిన్న ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 17 సెంటీమీటర్ల వర్షం కురవగా, అదే జిల్లాలోని వెంకటాపురంలో 15, పాల్వంచలో 14, భద్రాచలంలో 13, కొత్తగూడెం, జూలూరుపాడు, మహబూబాబాద్లలో 10, బయ్యారం, గార్లలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.