హీరో సిద్ధార్థ ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. తాను సైనా నెహ్మాల్ విషయంలో జోక్ మాత్రమే చేశానని సిద్ధార్థ్ వివరణ ఇచ్చుకున్నారు.
ఇటీవల పంజాబ్లో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై సైనా నైహ్వాల్ స్పందించారు. దేశ ప్రధానికి భద్రత లేకపోతే ఇక ఎవరికి ఉంటుందని ఆమె ట్వీట్ చేశారు. అయితే సైనా నెహ్వాల్ ట్వీట్ ను సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒక చిన్న కాక్తో ఆడే ప్రపంచ ఛాంపియన్.. భారత్ ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారంటూ కామెంట్ చేశారు.
దీంతో సిద్ధార్థ్ ట్వీట్ పై తీవ్ర దుమారం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్ తో పాటు.. కేంద్ర మంత్రి, చిన్మయి, సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్ద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
తాజాగా నటుడు సిద్ధార్ద్ ట్విట్టర్ వేదికగా తను పెట్టిన కామెంట్స్ పై మళ్ళీ స్పందించారు…సైనా పెట్టిన ట్వీట్ మీద తాను పెట్టిన పోస్ట్ జోక్ మాత్రమేనని, ఎవరిని కించపర్చే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని.. క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ను గౌరవిస్తానని చెప్పారు. మహిళలంటే తనకు గౌరవమన్నారు. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించమని కోరారు.
అయితే సిద్ధార్థ్ క్షమాపణ చెప్పడంపై సైనా నెహ్వాల్ స్పందించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి ట్వీట్లు చేయడం సరికాదని స్పష్టం చేసింది. అయినా తాను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది.”నా ట్వీట్పై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఎందుకు వైరల్ అయ్యాయో తెలియలేదు. సిద్ధార్థ్ ట్వీట్ ట్రెండ్ కావడం ఆశ్చర్యంగా అనిపించింది. అతను క్షమాపణలు చెప్పినందుకు సంతోషం” అని సైనా ట్విట్టర్లో రాసుకొచ్చింది..