నూరేళ్ల ఒలింపిక్స్ స్వర్ణ కలను సాకారం చేసిన ఘనుడు .. పధ్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత పతకాల పట్టికలో గోల్డ్ మెడల్ వేసిన యువకుడు .. ట్రాక్ అండ్ రన్ విభాగంలో వందేళ్ల నిరీక్షణకు తెరదించి గోల్డ్ పతాకాన్ని అందించిన ఆ శతాబ్ధానికొక్కడే నీరజ్ చోప్రా.
భారత ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెట్స్ కేటగిరిలో నీరజ్ చోప్రా శకం ప్రారంభమైంది. 1920 నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించేవరకు ఒకే ఒక్క పతకం కూడా అథ్లెట్స్ సాధించలేదు. ట్రాక్ అండ్ రన్ విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించడంతో భారతీయుల వందేళ్ల నిరీక్షణ ఫలించింది. హర్యానా నుంచి దూసుకు వచ్చిన ఈ స్వర్ణ రత్నానికి యావత్ భారతావని జయహో నీరజ్ అంటూ జేజేలు పలికింది. బంగారు బల్లెం వీరుడని మురిసి పోతోంది.
టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ స్టార్ ఫేవరెట్గా బరిలో దిగిన నీరజ్ చోప్రా నూట ముప్పై కోట్ల మంది భారతీయుల బంగారు కలను వమ్ము చేయలేదు. జావలెన్ త్రో విభాగంలో ప్రపంచ చాంపియన్లను పక్కకు నెట్టి తన ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. భారతీయుల వందేళ్ల కోర్కె నెరవేర్చిన నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతిల నుంచి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రెటీలు, క్రీడాకారులు, క్రీడాభిమానులతో పాటు సామాన్యులు సైతం నీరజ్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీరజ్ సాధించిన ఈ ఘనతతో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఇండియాకు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించిన అథ్లెట్గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఒలింపిక్స్ లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో భారతీయుడిగా రికార్డులకు ఎక్కారు.
మొట్టమొదటిసారిగా 1908లో జావెలిన్ త్రో గేమ్ పురుషుల విభాగాన్ని ఒలింపిక్స్లో ప్రారంభించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో జావెలిన్ త్రో గేమ్ను ప్రారంభించడం జరిగింది. షాట్పుట్, డిస్కస్ త్రో, హేమ్మర్ త్రోల తర్వాత చివరగా జావెలిన్ త్రో గేమ్ ను ఒలింపిక్స్లో చేర్చడం జరిగింది. జావెలిన్ త్రో ఉమెన్ కేటగిరీ కి సంబంధించి పలు చర్చలు జరిగిన తర్వాత 1932 ఒలింపిక్స్ లో ప్రారంభమైంది.
ఒలింపిక్స్లో ఈ గేమ్ ప్రారంభమైన వందేళ్ల వరకూ ఒకే ఒక్క భారతీయ అథ్లెట్ కూడా పతకాన్ని సాధించలేదు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాల్లో ఏ ఒక్క పతకాన్నీ సాధించలేదు. ఇప్పటి వరకు జావెలిన్ త్రో గేమ్లో ఫిన్లాండ్ క్రీడాకారుల హవా కొనసాగింది. పతకాల పట్టిక స్వర్ణ విభాగంలో ఫిన్లాండ్ క్రీడాకారుల ముద్ర స్పష్టంగా ఉంది. స్వీడెన్, జర్మనీ, హంగేరీ, అమెరికా, నార్వే, రష్యా, జర్మనీ, జెకోస్లేవియా వంటి దేశాల క్రీడాకారులు జావెలిన్ త్రో పతకాలను సాధించారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండోదైన భారత్ కు మాత్రం పతకాల పట్టికలో చోటు దక్కలేదు. ఆసియా ఖండంలో అతిపెద్ద దేశమైన భారత్ చిరకాల కోరికను 2020 టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా నెరవేర్చారు. గోల్డ్ ఫేవరెట్గా బరిలో దిగిన నీరజ్ అభిమానుల ఆశలను నిరాశ పరచకుండా స్వర్ణ పతకం సాధించి నూటముప్పై కోట్ల భారతీయులతో జయహో అనిపించుకున్నారు.
గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా వెలుగు చూసింది. నీరజ్ చోప్రా పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతానికి చెందిన వారని, హర్యానాకు వలస వెళ్లారని అమరావతి రైతులు అంటున్నారు. ఇప్పటికీ నీరజ్ తండ్రికి అమరావతితో సంబంధాలు ఉన్నాయని, రాజధాని రైతుల నిరసనదీక్షకు ఆయన సంఘీభావం కూడా తెలిపారని వారంటున్నారు. అమరావతి కుర్రోడు ఒలింపిక్స్ చరిత్రలో కొత్త చరిత్ర నెలకొల్పాడని గర్వపడుతున్నారు.
హర్యానా లోని పానిపట్లో ఉమ్మడి కుటుంబంలో ముద్దుబిడ్డగా గారాబంగా పెరిగిన నీరజ్ చోప్రా పదకొండేళ్లకే 90 కేజీల బరువుతో భారీకాయుడిగా మారాడు. అధికబరువున్న నీరజ్ను ఫ్రెండ్స్ అందరూ సర్పంచ్ అని ఆట పట్టించారు. నిక్నేమ్ సర్పంచ్ పోగొట్టుకోవడానికి, ఒబేసిటీని తగ్గించుకోవడానికి నీరజ్ ప్రారంభించిన ఆటలు అతడి జీవితంతో పాటు భారత అథ్లెట్ల రంగాన్ని కూడా బంగారుమయం చేశాయి.
2013లో సాధించిన ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్ తో నీరజ్ వైపు దేశం మొదటిసారి చూసింది. మొదటిసారి దేశ ప్రజలను ఆకర్షించిన వెంటనే నీరజ్ 2015లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో నిరాశ పరిచాడు. 2016 నుంచి మాత్రం అతను వెనక్కు తిరిగి చూడలేదు. సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్, ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్లో రజత పతకం, వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన చోప్రా జావెలిన్ను 86.48 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ పోటీల్లో ఆరు గోల్డ్మెడల్స్ సాధించాడు. నీరజ్ ప్రతిభకు ఆర్మీలో సుబేదార్ ర్యాంక్ దక్కింది. 2018లో గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్ను అర్జున అవార్డుతో సత్కరించింది. 2019లో నీరజ్ భుజానికి గాయం కావడంతో ఆ ఏడాది జరిగిన పోటీలకు దూరమయ్యాడు. అయితే 2020 నుంచి తిరిగి ట్రాక్లోకి వచ్చాడు.
ఒలింపిక్స్కు అర్హత సాధించడం కోసం ఒలింపిక్స్ కోటాలో పలు పోటీల్లో పాల్గొని రికార్డుల మోత మోగించాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జావెలిన్ త్రో పోటీలో పాల్గొన్న నీరజ్ 2018లో తన పేరిట నమోదైన 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో బద్దలు కొట్టాడు. ఆ మ్యాచ్ అనంతరం ఒలింపిక్స్లో పతకం కోసం నీరజ్ కఠోర శిక్షణను తీసుకోవడం ప్రారంభించారు. జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ ఎక్స్లెన్సీ ప్రోగ్రామ్లో చోటు దక్కించుకున్న నీరజ్ ఆస్ట్రేలియా కోచ్ గారీ కాల్వర్ట్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఒలింపిక్స్లో పాల్గొన్నది మొదటిసారే అయినా దేశానికి అథ్లెట్స్ ట్రాక్ అండ్ రన్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డులకు ఎక్కారు.
తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు: ఎంపీ బండి సంజయ్