బ్రిటన్ సర్కారు ఉద్యోగ విరమణ తరువాత ఇవ్వాల్సిన పెన్షన్లను కొంత కాలం నిలిపివేయాలన్న నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పెన్షన్ అర్హత వయస్సును 65 ఏళ్ల నుండి 66 ఏళ్లకు పెంచాలన్న జాన్సన్ సర్కారు నిర్ణయంపై ప్రభుత్వ పెన్షన్లలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళా ఉద్యోగుల సంఘం (వాప్సి) బ్రిటన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించే విషయంలో న్యాయమూర్తులు అయిష్టంగా వున్నప్పటికీ, ఈ నిర్ణయంపై మంచి చెడులు నిర్ణయించే బాధ్యత కోర్టుది కాదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పేదరికంలో వున్న మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని అంగీకరిస్తున్నట్లు చెప్పారు.
ఈ నిర్ణయంలో ఎటువంటి లింగ వివక్షకూ తావు లేదని అభిప్రాయపడిన న్యాయమూర్తులు మహిళల పెన్షన్ వయస్సును పురుషులతో సమానంగా పెంచటం స్త్రీ, పురుషుల మధ్య ఇప్పటి వరకూ కొనసాగిన చారిత్రక అసమానతలను సరిచేయటమేనని స్పష్టం చేశారు. ఇది కొంతమేరకు నిజమే అయినప్పటికీ మహిళల పట్ల జీవితాంతం వివక్ష చూపుతున్న పితృస్వామ్య వ్యవస్థ అంతమైపోయినా ఈ అసమానతలు కొనసాగుతుండటం విచారకరమని వాప్సి స్పష్టం చేసింది. అధికశాతం మంది మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నా ఇప్పటికీ వారి కన్నా తక్కువ వేతనాలనే అందుకుంటున్నారని పేర్కొంది. ఇప్పుడు పెన్షన్ల విషయంలో కూడా వివక్ష చూపటం వారికి మరింత అన్యాయం చేయటమే అవుతుందని స్పష్టం చేసింది. కోర్టు తమకు న్యాయం చేయకపోతే ప్రస్తుత ప్రభుత్వ స్థానంలో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటమే తమకు మార్గాంతరమవుతుందని తేల్చిచెప్పింది.