*ఆటోపై తెగిపడినహైటెన్షన్ విద్యుత్ వైరు
*ఆటోలో మంటలు చెలరేగి 5 మంది సజీవదహనం..పలువురు పరిస్థితి విషమం
*వ్యవసాయ కూలిపనులకు వెళ్తుండగా ప్రమాదం
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 8 మంది కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడ్డాయి.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 5 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరికొంతమందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మృతులు గుడ్డంపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఈ ఘటన తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలు పూర్తిగా దగ్ధమవ్వడంతో కూలీలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. బత్తాయి తోటలో చెట్ల వద్ద కలుపు తీయడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.