తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ పరిశ్రమలో రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతుండడంతో వాటిని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.