ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్ల దాడిలో ఇప్పటి వరకు 321 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బుధవారం ఉదయం కొలంబోలో మరో బాంబు పేలింది. ఓ సినిమా థియేటర్ వద్ద దుండగులు మోటారు బైక్లో పెట్టిన బాంబు పేలింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
శ్రీలంక భద్రతా యంత్రాంగం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఇంకా అక్కడక్కడా బాంబులు పేలుతూనే ఉన్నాయి. దీంతో కొలంబో వాసులు వణికి పోతున్నారు. మరిన్ని దాడులు చేసేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదులు ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టారా అన్న దానిపై పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.