పుదుచ్చేరిలోని కొత్తకుప్పం పట్టణంలో దారుణం జరిగింది. దీపావళి రోజు ( గురువారం) మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ మోటార్సైకిల్పై తీసుకెళ్తున్న దేశీ బాణసంచా పేలడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ పేలుడులో సమీపంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…
మృతుడు అరియాంకుప్పంకు చెందిన కలైనేశన్ (37) తన ఏడేళ్ల కుమారుడు ప్రదీష్తో కలిసి క్రాకర్స్ తీసుకుని పుదుచ్చేరి వైపు వెళ్తున్నాడు. దీపావళికి బాణాసంచా తన స్వస్థలం నుంచి కొనుగోలు చేశాడు.
పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో కలైనేశన్ స్కూటర్ నడుపుతుండగా కొడుకు బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నట్లు కనిపించింది. కొత్తకుప్పం సమీపంలో క్రాకర్లు పేలడంతో ఇద్దరూ మోటార్సైకిల్పై నుంచి 10-15 మీటర్ల దూరం వరకు కిందపడిపోయారని పోలీసులు తెలిపారు.
కలైనేశన్ వాహనం సమీపంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వాహనదారులు – గణేష్ (45), సయ్యద్ అహమ్మద్ (60), మరియు విజి ఆనంద్ (36) కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థాలానికి చేరుకున్న విల్లుపురం డీఐజీ ఎం.పాండియన్, ఎస్పీ ఎన్.శ్రీనాథ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టారు.
నవంబర్ 3న పుదుచ్చేరి నుండి రెండు బ్యాగుల నాటు పటాకిలు.. కొని తన అత్తమామల ఇంట్లో ఉంచుకున్నాడని చెప్పారు. నవంబర్ 4న కూనిమేడు నుంచి ఒక బ్యాగ్ తీసుకుని పుదుచ్చేరి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాపిడి వల్ల కలిగే వేడి కారణంగా క్రాకర్లు పేలి ఉండవచ్చు అని అంటున్నారు..
కూనిమేడు నుంచి గన్నీ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇండియన్ పీనల్ కోడ్, పేలుడు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.