హైదరాబాద్ ఎస్సార్ నగర్లో పట్టపగలే దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రితో పాటు బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అడ్డగించి విచక్షణా రహితంగా దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంతియాజ్ (21) కు సమీప బంధువైన బోరబండకు చెందిన సయ్యద్ అలీ కుమార్తె సయ్యద్ జైన్ ఫాతిమాతో (19) మూడేళ్ల క్రితం పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో వారు గురువారం సదాశివపేటలోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కలిపించాలని
ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లారు.
స్టేషన్ నుంచి బయటకు వచ్చి కారులో వెలుతున్న వాళ్ళను ఎస్సార్నగర్ మెట్రో రైలు స్టేషన్ సమీపంలో అడ్డుకొని కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఫాతిమా తన చెయ్యి అడ్డంగా పెట్టడంతో కత్తి ఆమెకు బలంగా తగిలి రెండు చేతి వేళ్లు తెగిపోయాయి. ఓ దశలో ఇంతియాజ్ కారు దిగి వెళ్లే ప్రయత్నం చేయగా నడిరోడ్డుపై పట్టుకొని మరోసారి దాడి చేశారు. ఈ ఘాతుకం అనంతరం నిందితులు అక్కడి నుంచి ఆటోలోనే పరారయ్యారు. తీవ్ర గాయాలైన నవ దంపతుల్ని పోలీసులు అమీర్పేట ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. ఇంతియాజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే దాడి జరిగిందని ఇంతియాజ్ తల్లిదండ్రులు ఆరోపించారు.