*ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి
*బ్యాంక్ స్టేట్ మేంట్లతో విచారణకు హాజరైన చీకోటీ
*చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలను వరుస ప్రశ్నిస్తున్న ఈడీ
*విదేశాల్లో క్యాసినో నిర్వహాణపై ఆరా
*చికోటీ ప్రవీణ్ వాట్సాప్లో కీలక సమాచారం..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. క్యాసినో హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ సోమవారం మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. బ్యాంకు స్టేట్ మెంట్ తో పాటు న్యాయవాదిని తీసుకొని ప్రవీణ్ విచారణకు హాజరయ్యారు.
అయితే ప్రవీణ్ ను మాత్రమే ఈడీ అధికారులు విచారణ చేసే గదిలోకి అనుమతిచ్చారు. ప్రవీణ్ న్యాయవాది విచారణ జరిగే గది బయటే ఉన్నారు.
ఈ కేసులో ప్రవీణ్తో పాటు బోయిన్పల్లికి చెందిన మాధవరెడ్డి, ట్రావెల్ ఏజెంట్ సంపత్లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ క్యాసినో దందాలో జరిగిన హవాలా లావాదేవీలతో పాటు.. సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన ఆరోపణ. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యాలను ప్రస్తావిస్తూ చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది
మరోవైపు ఈడీ కార్యాలయానికి బయలుదేరుతుండగా ఇంటి వద్ద మీడియా అడిగే ప్రశ్నలకు.. మీడియా తనను ఈడీ కంటె ఎక్కవ ప్రశ్నిస్తోంది, ప్రచారం చేస్తోందని చీకోటి ప్రవీణ్ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా విచారణ ఎదుర్కొంటానన్న టెన్షన్ ఏమాత్రం లేదు, పైగా గంభీరంగా కనిపించాడు.
ఇప్పటికే ప్రవీణ్ కు ప్రాణహాణి ఉందనే వార్తలు వినిపిస్తుండగా.. ఇంటి నుండి బయటకు వచ్చే క్రమంలో తన చుట్టూ ప్రైవేటు సెక్కూరిటీని ప్రత్యేక భద్రతకోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటి నుండి ఈడీ కార్యాలయంకు వెళ్లే వరకూ, తిరిగి ఇంటికి చేరే వరకూ తనతో ప్రైవేటు సెక్కూటీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.ఈ క్రమంలో ఈడీ కార్యాలయంలో వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.