తెలంగాణ టెన్పిన్ సంఘం ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ వేదికగా జరిగిన బౌలింగ్ చాంపియన్షిప్లో కిరణ్, జ్యోతి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో కిరణ్, నరేశ్… మహిళల కేటగిరీలో జ్యోతి, మమత వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో బెంగళూరు వేదికగా జరుగనున్న జాతీయ టెన్పిన్ బౌలింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేశారు.
ఈ పోటీలు ఐదు రోజుల పాటు జరగ్గా….100కు పైగా ప్లేయర్లు పాల్గొన్నారు. శుక్రవారం ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి విచ్చేసిన ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్పిన్ బౌలింగ్ సంఘం కార్యదర్శి రాహుల్ రెడ్డి, సినీ నటుడు శ్రీధర్, రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.