కోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. నగరంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. ఐదు రోజుల వరకూ ఆయన ఎవరినీ కలువబోరని వెల్లడించారు. తనకు మానసిక ప్రశాంతత కావాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. సుధాకర్ ను మెంటల్ హాస్పిటల్ లో ఎవరు చేర్పించారన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాకపోవడం గమనార్హం.
సుధాకర్ స్వయంగా వచ్చారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి వెల్లడించారు. పోలీసులే ఆయన్ను తీసుకెళ్లారని కేజీహెచ్ అధికారులు అంటున్నారు. సుధాకర్ కేజీహెచ్ ఓపీ విభాగంలో హడావుడి సృష్టించడంతో మానసిక వైద్య శాలకు తీసుకెళ్లాలని కోరగా, పోలీసులు తీసుకెళ్లారని అంటున్నారు. దీనిపై సీబీఐ మరింత లోతుగా విచారణ చేపట్టింది.