వేసవి ప్రయాణాలతో కూడుకున్న సమయం. ఈ సమయంలో అసలు రోడ్డు, రైలు మార్గాలలో ఖలీలే ఉండమంటే అతిశయోక్తి కాదు. మరి ఇంకా ఉంది వాయు మార్గం. ఇలా అయితే ఖర్చో.. దానికి భయపడాల్సిన పనేమీ లేదు, ఇటీవల విమాన సంస్థలు కూడా ప్రయాణికుల కోసం భారీగా ఆఫర్లను ఇస్తుండటం విశేషం. సాధారణంగా విమాన టికెట్ల ధరలు శీతాకాలం, వేసవి సెలవుల్లో అధికంగా ఉంటాయి. అయితే గత అక్టోబరు-జనవరి సీజన్లో మాత్రం టికెట్ల ధరలు మరీ అధికంగా పెరగలేదనే చెప్పాలి. ప్రయాణ తేదీ, ఆ ముందు రోజు కొనుగోలు చేసే, ఆఖరి నిమిషపు టికెట్లు అధికంగా పలికినా, వారం-పది రోజుల ముందు కొనుగోలు చేసిన వారికి కూడా ఎక్కువ భారం పడలేదనే పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పుడు విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో రద్దీ తక్కువగానే ఉంటుంది. అయితే ఏప్రిల్ మధ్యకు వచ్చేసరికి దాదాపు పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులందరికీ పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి, మళ్లీ ప్రయాణాల హడావుడి అధికమవుతుంది. ఈ సమయంలో ఏసీ బస్సులు, రైళ్లలో ఏసీ కోచ్లలో టికెట్ల ధరలూ మండుతుంటాయి. పైగా వందలు, వేల కిలోమీటర్ల దూరంలోని వేసవి విడుదులకు, సన్నిహితుల దగ్గరకు వెళ్లేందుకు..ఇప్పుడు ఆఫర్లలో వస్తున్న విమాన టికెట్లు కొనుగోలు చేసుకుంటే, భారం లేకుండా ఉంటుంది.
కొన్ని ఆఫర్లు :
* ట్రూజెట్
ఈనెల 8 నుంచి 17 వరకు ఆఫర్ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. బేసిక్ ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. దీనికి పన్నులు అదనం. వచ్చే అక్టోబరు 26 వరకు ప్రయాణించేందుకు రాయితీ టికెట్లు వినియోగించుకోవచ్చని తెలిపింది. అంటే వేసవి సెలవులతో పాటు దసరా సీజన్కు కూడా వాడుకోవచ్చు. ఈ ఆఫర్ ముగిసినా, ఏడాది పొడవునా విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు బేసిక్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తామని సంస్థ పేర్కొంటోంది.
* ఎయిరేషియా ఇండియా
బేసిక్ ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. దీనికి పన్నులు అదనం. ఈనెల 17 వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ప్రయాణ తేదీలు మాత్రం ఇప్పుడే కాదు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2020 జూన్ 2 వరకు ప్రయాణించవచ్చు. అంటే ఈ ఏడాది శీతాకాలంతో పాటు వచ్చే ఏడాది వేసవి సీజన్కు వాడుకోవచ్చన్న మాట.
* స్పైస్జెట్
పలు కొత్త మార్గాల్లో సర్వీసులు ప్రారంభించిన ఈ సంస్థ రూ.2,293 కనీస ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి.
* ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ
ఈనెల 7వరకు 3 రోజుల పాటు ఆఫర్లపై టికెట్లు విక్రయించింది. 10 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈనెల 19-సెప్టెంబరు 28 మధ్య ప్రయాణించవచ్చు.
ప్రయాణ తేదీలను ఖచ్చితంగా నిర్ణయించుకోగలిగిన వారే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. వివాహాది శుభ కార్యాల తేదీలు ముందస్తుగా నిర్ణయమవుతాయి కనుక, వీటికి వెళ్లదలచినవారు కొనుగోలు చేసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో పరీక్షలు, సెలవుల ప్రణాళిక కూడా ముందస్తుగా సిద్ధమవుతాయి కనుక, స్నేహితులు కలిసి ఎక్కడికైనా వెళ్దామనుకుంటే ఇప్పుడే సన్నద్ధమవ్వడం మేలు. అయితే కార్యాలయాల్లో పనిచేస్తూ, సెలవులపై ఖచ్చితమైన నిర్ణయానికి రాలేని వారు, ఇప్పుడు ఆఫర్లో కొనుగోలు చేయడంపై ఆచితూచి వ్యవహరించాలి.