బీజేపీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కు పలువురు కన్నీటి వీడ్కోలు పలికారు. డిల్లీ లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.సుష్మా కూతురు బాన్సురి స్వరాజ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పార్ధీవదేహాన్ని ఎలక్ట్రిక్ క్రిమటోరియంలోకి తరలించే ముందు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం బుల్లెట్లను గాలిలోకి పేల్చారు. అంతకుముందు సుష్మా స్వరాజ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించిన అనంతరం, బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి శ్మశాన వాటిక వరకు ఆమె అంతిమ యాత్ర నిర్వహించారు.
సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, బీజేపీ అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.