రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం దళిత బంధు ఈ నెల 16 నుండి అమలులోనికి రానుంది. నిన్న ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుండి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది.
దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. కేబినెట్ సమావేశంలో దళిత బంధు పథకం పూర్వాపరాలను సిఎం కెసిఆర్ విశదీకరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని. ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. కాగా.. ఈ దళిత బంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు తెలంగాణ ప్రభుత్తం ఇవ్వనుంది.