కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారంటైన్ (నిర్బంధ వైద్య సేవలు) సెంటర్లకు బాధితుల కుటుంబ సభ్యులను అనుమతించమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారికి ముందస్తు పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ బాధితులు కారని నిర్ధారించాకే పంపించేందుకు ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు బంధువులు, స్నేహితులు రావద్దని విజ్ఞప్తి చేశారు.
బాధితులను పరామర్శించడానికి వచ్చే వారివల్ల వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉన్నందున వారిని చూసేందుకు అనుమతించమని చెప్పారు. ‘మీరు వచ్చి వారిని చూస్తే సమాజాన్ని ప్రమాదంలో పడేసిన వారవుతారు. అందువల్ల మా మాట వినండి. కాదని వస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడం’ అని హెచ్చరించారు.