అతడు భవన నిర్మాణాలు చేపట్టే సివిల్ కాంట్రాక్టర్. కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ భవనాలు నిర్మించాడు. సకాలంలో అధికారులు బిల్లులు మంజూరు చేయకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఓ ఇంజినీర్ ఇంటి ముందు ఆ గుత్తేదారు తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్లో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం భవన నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్ రామశంకర్ గోపాల్గంజ్లోని చీఫ్ ఇంజినీర్ మురళీధర్ సింగ్ ఇంటి ఎదుట నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సిటీ ఆస్పత్రికి తరలించారు. నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం కాంట్రాక్టర్ రామశంకర్ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ సింగ్ ఇంటికెళ్లారు. ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.