ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తుది తీర్పు వెలువరించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును అందరూ గౌరవించాలని తెలిపారు. తీర్పు ఉభయ తారకంగా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు దశాబ్దాల అయోధ్య వివాదానికి సుప్రీం ఇచ్చిన తీర్పుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చారు.
ఇది కీలక సమయం అని ప్రతి పౌరుడు గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, శాంతిని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తమ వంతు ధర్మం నిర్వర్తించాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం చాటిచెప్పాల్సిన తరుణం ఇదేనని వ్యాఖ్యానించారు. అందరం భారతీయులం అనే సంకల్పంతో ముందుకు నడుద్దాం అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.