తన నానమ్మ ఇందిరాగాంధీ ముందు తాను ఓ నీటి బిందువులాంటిదాన్నని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అన్నారు. నానమ్మ అంతటి గొప్ప వ్యక్తిని తాను కాదని, దయ చేసి ఇందిరతో తనను పోల్చవద్దని కోరారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ సమాజం కోసం సేవ చేయాలనే ఆమెలోని అకుంఠిత స్వభావం తనలో, తన సోదరుడు రాహుల్ గాంధీలో ఉన్నాయని ప్రియాంకా అన్నారు. ఇలాంటి స్వభావాలను తమ నుంచి ఎవరూ తీసివేయలేరని చెప్పారు. మీరు మాకు మద్దతు పలికినా, పలకకపోయినా మేము మీ సేవలోనే ఉంటామని చెప్పారు.
సొంత ప్రయోజనాల కోసం బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలు రెండు రకాలుగా ఉంటాయని… ఒక రకం ప్రజల కోసం పని చేస్తుందని, మరో రకం స్వలాభం కోసం పని చేస్తుందని చెప్పారు. బీజేపీది అంతా పబ్లిసిటీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాన్పూర్ ను స్మార్ట్ సిటీ చేస్తామని బీజేపీ చెప్పిందని, కానీ, ఆ దిశగా ఇంతవరకు ఏమీ జరగలేదని అన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.