telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ శాశ్వత రాజధాని అమరావతే: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తో జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వానికి చెప్పే రాజధానిని మారుస్తున్నామని వైసీపీ నేతలు ప్రజలకు అబద్దాలు చెబుతున్నారన్నారు. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నప్పటికీ… రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో ఉపయోగించడం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.

ఏపీలో ప్రభుత్వాలు మారినా పనితీరు మాత్రం మారలేదని పవన్ అన్నారు. టీడీపీ, వైసీపీలు రెండూ రెండేనని చెప్పారు. నిర్దిష్టమైన ప్రణాళికతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే, రాబోయే రోజుల్లో అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పవన్ హెచ్చరించారు. 

Related posts