న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను.. బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రస్తుతం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ ప్రవీణ్ ప్రకాశ్ను ఆ స్థానానికి బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు చేశారు.
సీఎంవోలోకి రాక ముందు ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గానే ఉండేవారు. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన మొదట్లో ఢిల్లీలో జరిగిన ఓ టీటీడీ కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన ఏపీ సీఎంవోలోకి వచ్చి కీలకంగా ఎదిగారు.
జగన్ నమ్మిన అధికారిగా ప్రవీణ్ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రిపబ్లిక్ డే రోజు మోకాళ్లపై కూర్చొని ప్రవీణ్ ప్రకాష్ సీఎం జగన్కు ఏదో చెబుతూండటం మీడియాలో హైలెట్ అయింది. అయితే ముఖ్యమంత్రికి ముఖ్య సలహదారుల్లో ఒకరిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఇంత హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారన్నదానిపై చర్చనీయాంశంగా మారింది.