భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైసీపీ అని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూనే ఉన్నామని అన్నారు.
నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరింది అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
మూడేళ్లలో మంచి పాలన అందించడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఇతర పార్టీల నేతలను లాక్కోవడంపై దృష్టి పెట్టలేదని వివరించారు. నాయకుడిని, పార్టీ నడిపించేవి.. క్యారెక్టర్, క్రెడిబులిటీ మాత్రమేనని తెలిపారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రజలకు మంచి పనులు చేయాలనే ఆలోచన టీడీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే చిప్.. గుండెలో ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కు పదవిపైనే వ్యామోహముందని విమర్శించారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చంద్రబాబు అర్జీ పెట్టుకున్నారని జగన్ తెలిపారు. కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశామని అన్నారు