telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశానికే వన్నె తెచ్చేలా తెలంగాణ సచివాలయం : సీఎం కేసీఆర్

kcr telangana

తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సీఎం ఇవాళ పరిశీలించారు. సచివాలయ నిర్మాణంలో, సుందరీకరణ కోసం, వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో వున్న పిల్లర్లను, బీమ్ ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు.

అనంతరం ప్రగతి భవన్ లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతికాలంలోనే అభివృద్ది సంక్షేమ రంగాల్లో దేశానికే మార్గదర్శిగా పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలువాలి. ఉద్యోగులకు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు రాష్ట్రపతి భవన్ సమీపంలో వున్న మాదిరి ధోల్ పూర్ స్టోన్ తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించుకోవాలి. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం అన్నారు.

Related posts