దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ఉదయం డీఎస్పీ దిలీప్ కిరణ్ నేతృత్వంలో పోలీసుల బృందం చింతమనేని ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సోదాలకు ప్రయత్నించగా చింతమనేని అనుచరులు పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.
చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు సోదాలంటూ అనుచరులు నిలదీశారు. దాదాపు గంట సేపు సోదాలు చేసిన 25 మంది పోలీసుల బృందం చింతమనేని తండ్రిని ప్రశ్నించింది. జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసు నమోదుచేయడంతో గత మూడువారాలుగా చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా చింతమనేని ఇవాళ జిల్లా ఎస్పీ నవదేవసింగ్ ఎదుట లొంగిపోనున్నారు.