ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాల వలన ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు వేణు మాధవ్. చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు. వేణుమాధవ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం కేసీఆర్ ఆ భగవంతుడిని ప్రార్థించారు.
previous post
రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కలేదు : మంచు మనోజ్