పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం అందించారు. ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా సత్కరించారు. పద్మ శ్రీ పురస్కారం వరించిన సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పద్మశ్రీ అవార్డు పొందిన మొగిలయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.తెలంగాణ టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు వెంట రాగా.. సీఎం కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో ఆయనను సత్కరించారు.
మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని కొనియాడారు.
ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని.. గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కళాకారులను గౌరవించటంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
పద్మశ్రీ మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చుగా.. కోటి రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని.. కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ కోసం ప్రారంభ లిరిక్స్ ని మొగిలయ్య తనదైన శైలిలో పాడి మెప్పించారు. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ పాట విడుదలయ్యాక మొగిలయ్యని పలు మీడియా సంస్థలు పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేశాయి. దీనితో మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా మొగిలయ్య కిన్నెర కళని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.