యాస్ తుఫానుపై హోమ్ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు సీఎం జగన్. ఈ సందర్బంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని సీఎంకు వివరించారు అధికారులు. తుఫాను వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని..ముందు జాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్ సిలెండర్లకు రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని..ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని..తుఫాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆ మేరకు సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.. తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత రోజుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా అధికారులు దృష్టిపెట్టాలని కూడా ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్లను అవసరమనుకుంటే ఇప్పుడే తరలింపు పూర్తి కావాలన్న సీఎం.. కరెంటు సప్లైకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తిస్తాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని.. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పునఃసమీక్షించుకుని అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
ప్రజావేదిక కూల్చివేత కక్షసాధింపు చర్యే: బుద్దా వెంకన్న