దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ మరికొన్ని రోజుల్లో ఎత్తేసే అవకాశాలు ఉండడంతో విమానయాన సంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. విమాన ప్రయాణాలు చేసేవారితో పాటు, విమాన సిబ్బంది తప్పకుండా మాస్కులు వాడాల్సిందేనని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు.
ఇకపై విమానంలో అందించే భోజనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం నీళ్లు మాత్రమే అందించనున్నారు. లావెటరీలను సైతం పరిమిత సంఖ్యలో వాడనున్నట్లు చెప్పారు. లాక్డౌన్ ముగిసి, విమాన సేవలను కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తారు.ఈ మేరకు ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖకు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు లేఖ ద్వారా ఈ విషయాలను తెలిపినట్లు సమాచారం.
విమాన సేవలు తిరిగి ప్రారంభమైన వెంటనే ప్రయాణికులు గతంలోలా సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఈ విషయంపై అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. వారి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి తర్వాతే టర్మినల్కు వెళ్లేందుకు అనుమతిస్తారని తెలుస్తోంది.