telugu navyamedia
తెలంగాణ వార్తలు

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడను-భట్టి విక్రమార్క

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో సమావేశమనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌ తమ ఎమ్మెల్యే కాబట్టే మాట్లాడడానికి వచ్చానన్నారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భట్టి చెప్పారు.

సోనియా గాంధీ, రాహుల్‌ అంటే రాజగోపాల్‌ రెడ్డికి గౌరవం ఉందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా తాను రాజగోపాల్ రెడ్డికి సూచించినట్టు పేర్కొన్నారు.

పదవులు చాలా మంది కోరుకున్నా కొందరికే దక్కుతాయన్నారు. రాష్ట్ర ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని రాజగోపాల్‌తో చెప్పానని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా కూడా రాజగోపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం సాధించుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు దక్కడం లేదనే ఆవేదన రాజగోపాల్ రెడ్డిలో ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ తీరుపై సీరియస్‌గా పోరాడుదామని రాజగోపాల్ అన్నారని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్సేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో ఉన్న మంత్రులను తమ నియోజకవర్గాల్లో ఉన్న అవసరాల రీత్యా తమ పార్టీ ప్రజాప్రతినిధులు కలిసి ఉండొచ్చన్నారు. ఇలా కలిసినంత మాత్రాన రాజకీయంగా చూడడం సరైంది కాదన్నారు.

Related posts